రేపు జూడాల చలో హైదరాబాద్, సామూహిక దీక్షల యోచన
గత నెల రోజులుగా జూనియర్ డాక్టర్లు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలుత రిలే నిరాహార దీక్షలు చేస్తూ సాధారణ సేవలను బహిష్కరించారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగిస్తే భయపడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరింది. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారిని దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకతను దీక్ష విరమించాడు. మిగతా ఇద్దరిని ఈ రాత్రి శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలిస్తే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు దిగే యోచనలో జూనియర్ డాక్టర్లున్నారు.
రాష్ట్రంలో పది టీచింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పది టీచింగ్ ఆస్పత్రుల్లో ఒక్కో ఆస్పత్రి నుంచి ముగ్గురేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్ట్రర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ వైద్యుల ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.