21 రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకింగ్, బడ్జెట్ సైట్ కూడా
ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న తరుణంలో ఈ సంఘటన చేటు చేసుకోవడం గమనార్హం. బడ్జెట్ వివరాలు ఉండే వెబ్ సైట్లు హ్యాకింగ్కు గురైనట్లు తెలుస్తోంది. వివిద శాఖలకు చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు హోమ్ పేజీలను మాత్రం మార్చలేదు. హ్యాకర్లు కేవలం సత్తా కలవారని మాత్రమే నిరూపించేందుకు హ్యాకింగ్ కు పాల్పడ్డట్లు మెసేజ్లు పెట్టారు. వెబ్ సైట్ల హ్యాకింగ్ తెలుసుకున్న సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్(సిఈఆర్) టీం రంగంలోకి దిగింది. వెబ్ సైట్లను పరిశీలిస్తోంది. కాగా బడ్జెట్ కు సంబంధించిన వెబ్ సైట్ హ్యాకింగ్కు గురైనట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. రేపు యథావిధిగా బడ్జెట్ ప్రవేశ పెడతామని చెప్పారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులతో ఈ అంశంపై మాట్లాడానని ఆయన చెప్పారు. వెబ్ సైట్లను హ్యాక్ చేశారా లేక వైరస్ సోకిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఐటి కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. సాయంత్రం లోగా కారణం తెలుస్తుందని, దీనిపై సిఈఆర్ను అప్రమత్తం చేశామని చెప్పారు. సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామన్నారు.