బొత్స సత్తిబాబుపై కిరణ్ కుమార్ రెడ్డి పైచేయి
కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాలతో బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. చిరంజీవిని చేరదీసి ముఖ్యమంత్రి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం బొత్సలో ఉంది. తాజాగా, ఆయన బొత్స సత్యనారాయణపై తెలంగాణ శాసనసభ్యులు ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడ్డారు. వీరి వెనక ముఖ్యమంత్రి ఉన్నారని అంటున్నారు. ఆర్. దామోదర రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి వంటి తెలంగాణ శాసనసభ్యులు బొత్స సత్యనారాయణ జోడు పదవులను బహిరంగంగానే తప్పు పడుతున్నారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే వాదనను వారు గట్టిగా వినిపిస్తున్నారు.
ఆర్ దామోదర్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిసి తన వాదన వినిపించారు. తెలంగాణవారికి అన్యాయం జరుగుతోందని కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలోనే బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై కోపంతో గురువారం సాయంత్రం జరిగిన సిఎల్పీ సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారని చెబుతున్నారు. శుక్రవారం పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి బొత్సపై పైచేయి సాధించడానికి ఏ విధమైన అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాజాగా, ఉప ఎన్నికల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లు ఆయన శుక్రవారం చెప్పారు. బొత్స సత్యనారాయణకు చెప్పకుండా ఉప ఎన్నికల వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్సకు సాధ్యమైనంత మేరకు ప్రాధాన్యం తగ్గించే యోచనతో ఆయన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.