కెసిఆర్ కార్నర్: మారుతున్న రాజకీయ సమీకరణాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు, బిజెపికి మధ్య కొనసాగుతూ వస్తున్న స్నేహం బెడిసికొడుతోంది. మొదట రెండు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని భావించిన బిజెపి ఇప్పుడు ఒత్తిడితో అన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత మహబూబ్నగర్, కోస్తాంధ్రలోని కోవూరు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని అనుకుంది. కానీ మొత్తం స్థానాలకు పోటీ చేసి కెసిఆర్కు షాక్ ఇచ్చే పనిలో పడినట్లు అర్థమవుతోంది. బిజెపి పోటీ చేస్తే కొంత మేరకు తెలంగాణ సెంటిమెంటుకు సంబంధించిన ఓట్లు చీలే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పాటు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కూడా కెసిఆర్ను కార్నర్ చేసే పనిలో పడ్డాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోవూరు స్థానానికి మాత్రమే పరిమితమవుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు ఫలితాలు ఊహించిన పద్ధతిలో ఉండవా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలోని ఆరు స్థానాలకు పోటీ చేస్తున్న తెరాస విజయం కోసం చెమటోడ్చాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికలు కెసిఆర్కు ప్రతిష్టాత్మకమే అవుతాయి. దాదాపుగా కెసిఆర్ను అన్ని పార్టీలు కార్నర్ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు అనుకూల వైఖరి తీసుకున్నప్పటికీ సిపిఐ తెరాసకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
తెలంగాణ సెంటిమెంటుపై ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెరాస చెబుతుండగా దానిపై జరగగడం లేదని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంటున్నాయి. కాంగ్రెసు, తెరాసలను ఎండగట్టే పనిని తెలుగుదేశం పార్టీ పెట్టుకోగా, కాంగ్రెసు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. రాష్టంలో తన భవిష్యత్తు కోసం కోవూరు సీటును గెలవాల్సిన అనివార్యతలో వైయస్సార్ కాంగ్రెసు పడింది.