హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రాంతీయ బోర్డు ఏర్పాటే పరిష్కారంగా కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ మండలి ఏర్పాటుతో పాటు రూ.15 - 20 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంటుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణ సమస్యపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి సారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు ప్రశాంతంగా ఉండడం, సకల జనుల సమ్మె విరమణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతీయ మండలి ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తూ ఏప్రిల్లోగా ప్రకటన చేయాలనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక మండలి స్వరూప స్వభావాలపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ తరహా పరిష్కార మార్గాన్నే తెలంగాణకు వర్తింపజేయాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో పలు మార్లు చర్చలు జరిపిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సోనియాకు ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ, చట్టబద్ద హక్కులతో తెలంగాణకు ప్రత్యేక మండలి ప్రకటిస్తూ భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.