వర్షాల కోసం వరుణ యాగం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన 2 నెలలు గడిచినా కూడా సరిగ్గా వానలు పడకపోవడంతో ప్రాజెక్టులు ఇప్పటికీ జలకళను సంతరించుకోకపోవడం రాష్ట్ర రైతాంగంలో ఆందోళనను కలిగిస్తోంది. ఇటీవల ఉత్తర తెలంగాణలో కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇంకా అనేక ప్రాంతాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
వరుణ యాగానికి ముహూర్తంగా ఆగస్టు 10వ తేదీని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహణకు వేదిక కానుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువుల నిర్వహించనున్నారు.కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో ఈ వరుణ యాగం జరగనుంది. యాగం అనంతరం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆగష్టు 10వ తేదీన మధ్యాహ్నం 3.24 గంటలకు జరిగే యాగం 'పూర్ణాహుతి'కి ముఖ్యమంత్రి హాజరవుతారని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.




Click it and Unblock the Notifications