ఉప ఎన్నికల్లో కెసిఆర్ కారు జోరు, జగన్ ఫ్యాన్ హవా
వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి టి రాజయ్య 32 వేల భారీ ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెసు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో కూడా తెరాస విజయం సాధించింది. కొల్లాపూర్లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మంత్రి డికె అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినప్పటికీ జూపల్లి కృష్ణారావు విజయాన్ని అడ్డుకోలేకపోయారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.
మహబూబ్నగర్లో తొలుత కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో పుంజుకుని తెరాస అభ్యర్థి ఇబ్రహీం నాలుగో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకారు. అయితే ఆఖరు రౌండ్లో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి పుంజుకుని విజయం సాధించారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.