'ఉప ఎన్నికల్లో వైయస్ గెలిపించారు, కిరణ్ పోగొట్టారు'
2008లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నీ తానై గెలిపించారని అన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందే వైయస్ ఫలితాలు ఎలా వచ్చినా తాను బాధ్యత వహిస్తానని చెప్పారని, కానీ కిరణ్ మాత్రం అలా చేయడం లేదని అంటున్నారు. ఖాళీ అయినవి పార్టీ సీట్లు కాకపోయినప్పటికీ వైయస్ ఒకటికి రెండు సార్లు ఆయా నియోజకవర్గాలలో పర్యటించి ఐదు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాలు గెలిపించారని కిరణ్ మాత్రం ఉన్న సీట్లలో కూడా గెలిపించలేక పోయారంటున్నారు. విపక్షాల స్థానాలు అయినప్పటికీ వైయస్ అన్ని నియోజకవర్గాలను పూర్తిగా పరిశీలించారని, స్థానిక నేతలతో మాట్లాడి అన్నింటిని అంచనా వేశారని అంటున్నారు.
అందుకు విరుద్ధంగా కిరణ్ కాంగ్రెసు పార్టీ స్థానాలు అయిన కొల్లాపూర్, స్టేషన్ ఘనపూర్లో అంచనా వేయలేక పోయారని, అంతేకాకుండా టిడిపి స్థానాలతో ఖాళీ అయి, విపక్షాలు ఓట్లు చీలినప్పటికీ కిరణ్ దానిని సద్వినియోగం చేసుకోలేక పోయారని అంటున్నారు. కనీసం ఆయా స్థానాలలో కాంగ్రెసును రెండో స్థానంలో కూడా నిలబెట్టలేక పోయారని విమర్శిస్తున్నారు. కొల్లాపూర్లో కాంగ్రెసు ఆ రెండో స్థానంలోనైనా నిలవడానికి కారణం మంత్రి డికె అరుణ గెలుపు కోసం చేసిన ప్రయత్నమే తప్ప కిరణ్ చేసిందేమీ లేదంటున్నారు. అన్ని నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి అలా మెరిసి ఇలా మాయమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అభ్యర్థుల విషయంలోనూ సిఎం నిర్ణయాలు గందరగోళానికి దారి తీశాయంటున్నారు. మ.గనర్లో విష్ణువర్ధన్ రెడ్డికి బదులు రాజేశ్వర రెడ్డి సతీమణిని నిలబడితే కాంగ్రెసు గెలిచి ఉండేదని అంటున్నారు. కొవూరులో నల్లపురెడ్డిపై బలమైన అభ్యర్థిని నిలబెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కిరణ్ క్యాడర్ కన్నా యంత్రాంగం మీదే ఆధారపడ్డారని అంటున్నారు. కిరణ్ దాదాపు అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత వైయస్ కాలికి బలపం కట్టుకొని తిరిగి 2008లో గెలిపించారని, కిరణ్ మాత్రం అతివిశ్వాసంతో వెళ్లి ఉన్నవాటిని కూడా నిలబెట్టలేక పోయారని అంటున్నారు.