కాంగ్రెసు, టిడిపిలకు తెలంగాణ, వైయస్ జగన్ గుబులు
తిరుపతితో పాటు 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఆందోళనకు గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కన్నా తెలంగాణలో తాము మెరుగు పడ్డామని చంద్రబాబు చెప్పినా అది పైకి చెప్పే మాటగానే భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుచుకున్న నాలుగు సీట్లను తెలుగుదేశం పార్టీ కోల్పోగా, రెండు సీట్లను కాంగ్రెసు పార్ట కోల్పోయింది. అది మెరుగుపడడంగా చెప్పలేమని అంటున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు ఓట్లనే కాకుండా తెలుగుదేశం పార్టీ ఓట్లను కూడా చీల్చినట్లు కోవూరు ఫలితం తెలియజేస్తోంది. పైగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైంది. అలాంటి జిల్లాలో జగన్ కోవూరు సీటును కొట్టుకుపోయారు.
వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కోవడం ఇటు కిరణ్ కుమార్ రెడ్డికి గానీ అటు చంద్రబాబు నాయుడికి గానీ అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. జగన్ అవినీతిపై వెల్లువెత్తిన విమర్శలు కోవూరులో పనిచేయలేదని అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి చంద్రబాబు కోవూరులో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెసు అభ్యర్థి విజయం కోసం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ప్రచారం చేశారు. అయినా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించలేకపోయారు.
తెలంగాణ సెంటిమెంటు అంత సులభంగా తగ్గదనే విషయాన్ని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రుచి చూశాయని అంటున్నారు. నిజానికి, కెసిఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తే చాలు, తెలంగాణ సెంటిమెంటును అధిగమించవచ్చునని చంద్రబాబు పనిచేయడమే వ్యూహాత్మక తప్పిదమని అంటున్నారు. వ్యక్తిగతంగా కెసిఆర్పై తెలంగాణ ప్రజలకు ఏదో మేరకు వ్యతిరేకత ఉందని, తెలంగాణ కోసం పనిచేసే ఏకైక నాయకుడిగా కెసిఆర్ను, ఏకైక శక్తిగా తెరాసను గుర్తించి మాత్రమే ప్రజలు ఓటేస్తున్నారని అంటున్నారు. తెరాస ఓడిపోతే తెలంగాణ ఉద్యమం చల్లారిందనే ప్రచారం ముమ్మరమవుతుందనే ఏకైక కారణంతో తెరాస గెలుస్తోందని అంటున్నారు. అందువల్ల తెలంగాణ అంశాన్ని దాన్ని పరిష్కరించడం ద్వారా మాత్రమే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అధిగమించగలవని అంటున్నారు.