గేటు ముందు అడ్డంగా పడుకున్న తెరాస ఎమ్మెల్యేలు
సభ ప్రారంభమైన కొద్ది సేపటికే స్పీకర్ వాయిదా వేశారు. తెలుగుదేశం, తెరాస పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ అంశంపై పట్టుబట్టారు. ఇరు పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు పోయారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. కాగా ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కొవూరు నుండి గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 29న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గంప గోవర్ధన్, జోగు రామన్న, టి.రాజయ్య, జూపల్లి కృష్ణా రావు, నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సభలో తెరాస బలం 16, బిజెపి బలం 3కు పెరిగింది.
కాగా అంతకుముందు గన్ పార్కు వద్ద తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ కోసం యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ కోసం ఇంతమంది చనిపోతున్నా ఆంధ్రా నేతలు సానుభూతి తెలిపింది లేదన్నారు. తెలంగాణ పంథాను వీడేది లేదని ఈటెల రాజేందర్ అన్నారు. కాగా నాగం జనార్ధన్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లబోతుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నాగం మండిపడ్డారు. కిరణ్ నీకు మూడిందన్నారు. ఆయన భరతం పడతామన్నారు. ఆయనకు మనసు లేదన్నారు.