18 సీట్లకు ఉప ఎన్నికలు, తెలంగాణపై తాత్సారమే?
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ వాదనతోనే ఆయన ఉప ఎన్నికల్లో ప్రచారానికి దిగే అవకాశం ఉంది. దానికి మరో విషయాన్ని కూడా జోడించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోతోందని, సీమాంధ్రకు కూడా నష్టం జరుగుతోందని ఆయన చెప్పే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతారని అంటున్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం చేసిన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోందని చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భయం కాంగ్రెసును పట్టి పీడిస్తోంది. ఈ 18 స్థానాల్లో కొన్నైనా గెలవాల్సిన అనివార్యతలో కాంగ్రెసు పడింది. గెలిపించాల్సిన అనివార్యతలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పడ్డారు. కొన్ని స్థానాలైనా గెలవకపోతే ఇప్పటికే రగులుతున్న అసమ్మతి కుంపటి మరింతగా రాజుకునే ప్రమాదం ఉంది. కాంగ్రెసు పార్టీ అతలాకుతలం కాక తప్పదు. ప్రస్తుతం తెలంగాణ అంశం కాంగ్రెసు అధిష్టానానికి చిక్కుముడిగానే ఉంది. దాన్ని విప్పడం కాంగ్రెసు అధిష్టానానికి అంత సులభంగా కనిపించడం లేదు. అట్లని పరిస్థితి ఇలాగే కొనసాగడాన్ని అనుమతించనూ లేదు.