ఉప పోరు: వైయస్ జగన్, కిరణ్లు జీవన్మరణ సమస్య
మొత్తంగా చూస్తే, 18 శాసనసభా స్థానాలు, లోకసభ స్థానం కాంగ్రెసు పార్టీకి చెందినవే. వీటిలో ఒక్క స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి చెందింది లేదు. దాంతో ఈ 18 స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటేనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థానం పదిలంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేనిపక్షంలో కాంగ్రెసులో ముసలం మరింతగా ముదిరి, ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చునని అంటున్నారు. అదే సమయంలో తిరుపతి స్థానాన్ని పక్కన పెట్టినా మిగతా 17 స్థానాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే వైయస్ జగన్ భవిష్యత్తు ముందుకు సాగుతుంది. లేదంటే ఆయనపై ప్రజా విశ్వాసం తగ్గిందనే ప్రచారం ముమ్మరం కావచ్చు. ఏ ఒక్క సీటు ఓడినా ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం తీవ్రంగానే పడవచ్చు.
ఇక, రాజకీయంలో చాణక్యుడిగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటేనే మంచిదనిపిస్తోందని ఆయన ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఉప ఎన్నికలు ఇలా రావడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, దుష్టశక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తాము ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన సమయానికి ఏం చేస్తారో చెప్పలేం. అయితే, 18 స్థానాల్లో కూడా విజయానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, కాంగ్రెసు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనే ఉంది. ఈ స్థితిలో వైయస్ జగన్ పార్టీ కాంగ్రెసు కన్నా ముందుండాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఏ ఒక్క సీటు గెలిచినా ఆ పార్టీ నైతిక స్థయిర్యం పెరుగుతుందని అంటున్నారు.