ఛార్జీషీట్లో కెవిపి, మంత్రుల పేర్లేవి?: సిబిఐకి తలసాని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో ఇప్పటికే ఆరుగురు మంత్రులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకున్నారని గుర్తు చేశారు. వారి పేర్లు ఛార్జీషీటులో ఎందుకు లేవన్నారు. వాన్పిక్ కు కూడా పెద్ద ఎత్తున భూకేటాయింపులు జరిపారని అది కూడా లేదన్నారు. దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని లేకుంటే తాను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.
సిబిఐ తన పని పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆయన సూచించారు. సిబిఐ ఛార్జీషీట్ వెనుక ఏమైనా డబ్బులు చేతులు మారాయా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు సిఫార్సు చేశాకే ముఖ్యమంత్రి జివోల పైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. దివంగత వైయస్ హయాంలో తీసుకున్న నిర్ణయాకలు మంత్రివర్గం కూడా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. నా రాజకీయ భవిష్యత్తు ఏమిటో చెప్పాల్సిన సమయంలో చెబుతానని ఆయన అన్నారు. కాగా ఇటీవల రాజ్యసభ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినప్పుడు ఆయన తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓ సమయంలో ఆయన పార్టీ నుండి బయటకు వచ్చే అవకాశముందని పలువురు భావించారు.