ఉత్తరాంధ్ర అభివృద్ధికి వంగపండు ఆధ్వర్యంలో కొత్త పార్టీ
స్వాతంత్రం వచ్చి అరవై అయిదేళ్లు అవుతున్నా ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా ఉందన్నారు. ఈ ప్రాంతం నుండి అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళుతున్న నేతలు మాకు చేసిందేమీ లేదన్నారు. ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎంపీలు ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు.
ఇక్కడి నుండి వెళ్లిన నేతలు తమ పిల్లలను అమెరికాకు పంపించి చదివిస్తున్నారని, కానీ ఈ ప్రాంతం గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తన పార్టీ పేరిట యువతరం అనే కొత్త శక్తితో కుళ్లు రాజకీయాలను కడిగేస్తామన్నారు. మాది సమైక్య నినాదమే అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. తన ఆటా-పాటతో ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి రానున్న కాలంలో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ కంటే ముందే ఉత్తరంధ్ర సంగతి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ అర్ధరాత్రే కేంద్రం తెలంగాణ ఇస్తే మా పరిస్థితి ఏమిటన్నారు. ఈ ప్రాంత భూములు ఏమయ్యాయో నేతలు చెప్పాలన్నారు. కాగా పాలక వర్గాల నిర్లక్ష్యం కారణంగా పేద వర్గాలు, గ్రామీణ వృత్తులు ఛిద్రమవుతున్న వైనాన్ని వంగపండు పార్టీ ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ పార్టీకి వంగపండు గౌరవ అధ్యక్షుడిగా ఉంటారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సమస్యలే ప్రధాన అజెండాగా ఉద్యమిస్తారు.