కిరణ్, ఓవైసీ మధ్య విభేదాలు, జగ్గారెడ్డితో తీవ్రం

కీలకమైన సమయంలో మద్దతిచ్చిన మజ్లీస్తో కిరణ్ కుమార్ రెడ్డి విభేదాలు ప్రభుత్వానికి తిప్పలు తెచ్చి పెడతాయని అంటున్నారు. రాష్ట్రంలో మతఘర్షణలు నివారించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారు. మజ్లీస్కు చెందిన ఐదుగురు సభ్యులు మద్దతు ఇవ్వకుంటే కిరణ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేదే. కానీ మజ్లీస్కు చెందిన ఏడుగురు సభ్యులు మద్దతు ఇచ్చి కిరణ్ ప్రభుత్వాన్ని నిలబెట్టారు.
మజ్లీస్, కాంగ్రెసు మధ్య మొదటి నుంచీ సత్సంబంధాలే ఉన్నాయి. ఇటీవలి సంగారెడ్డి మతఘర్షణలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి తీరు ముస్లిం సంస్థలకు చెందిన నాయకులను ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ముస్లిం సంస్థల ఒత్తిడి పెరగడంతో మజ్లీస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.
మతఘర్షణల్లో కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గా రెడ్డి పాత్రపై ముస్లిం సంస్థలు ఫిర్యాదు చేశాయి. అయితే, ముఖ్యమంత్రి మాత్రం జగ్గారెడ్డిని వెనకేసుకొచ్చినట్లు తెలుస్తోంది. 2011 సెప్టెంబర్లో ఆదోనీలో జరిగిన మతఘర్షణల బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడం పట్ల కూడా ఓవైసీ సోదరులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్లో బిజెపి దూకుడుపై మజ్లీస్ కాంగ్రెసు పార్టీని హెచ్చరించింది. అయితే, కాంగ్రెసు నాయకులు బిజెపిని తక్కువ అంచనా వేశారని, గెలవాల్సిన మహబూబ్నగర్ సీటుపై కాంగ్రెసు నిర్లక్ష్యం వహించడంతో బిజెపి తన్నుకుపోయిందని మజ్లీస్ అభిప్రాయపడింది. ఈ కారణాలతో ఓవైసీ సోదరులకు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ముదురుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications