చంద్రబాబును కార్నర్ చేస్తున్న వైయస్ జగన్

ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ససేమీరా అన్న బాబు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. అంతేకాదు దానిపై పశ్చాత్తాపం కూడా ప్రకటిస్తున్నారు. జగన్, ఆయన పార్టీ నేతలు మాత్రం దీనిపై ధీటుగానే స్పందించారు. బాబుకు వైయస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉచిత విద్యుత్ గుర్తుకు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
ఇటీవల కాంగ్రెసు పార్టీపై పెంచిన విద్యుత్ ఛార్జీల పైన చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుపై బాబు ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచి రైతుల మృతికి కారణమైన చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుపై ధర్నా చేయడం ఆశ్చర్యంగా ఉందని జగన్ విమర్శలు చేశారు.
ఇలా ప్రతి ప్రభుత్వ వ్యతిరేక విధానంపై చంద్రబాబు చేస్తున్న నిరసన కార్యక్రమాలను, ఆయన హయాంలో చేసిన తప్పులను జగన్ ఎత్తి చూపిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మార్ కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేటాయింపులను చంద్రబాబు తప్పుపడుతుంటే జగన్ మాత్రం ఆయన పైనే అవి బాబు విధానాలు అంటు ఎదురు దాడి చేశారు, చేస్తున్నారు. కోర్టులో మాత్రం సిబిఐ 2000 నుండి విచారిస్తున్నమని చెప్పడం వేరే విషయం.
పథకాలు, కేసులపై ఎదురు దాడి చేస్తున్న జగన్ తాజాగా తెలుగుదేశం పార్టీ తమ సొంతమని భావిస్తున్న స్వర్గీయ నందమూరి తారక రామారావుపై దృష్టి సారించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఆ తర్వాత వైయస్సార్ ఎక్కువ ప్రజాధరణ కలిగిన నేతలు. వైయస్పై అభిమానం ఉన్న వారందరూ దాదాపుగా ఇప్పుడు జగన్ వైపే ఉన్నారని చెప్పవచ్చు.
దీంతో జగన్ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రజాకర్షణ తన సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆయన గోదావరి జిల్లా పర్యటనలో ఎన్టీఆర్కు నమస్కరించారు. అంతేకాదు ఓ కార్యకర్తతో ఆయన విగ్రహానికి పూలమాల వేయించారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ పథకాలను పొగిడారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైయస్ఆర్ ఇద్దరే ప్రజాధరణ కలిగిన నాయకులు అని చెప్పుకొచ్చారు.
తద్వారా టిడిపిలో చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న క్యాడర్తో పాటు ఆయనను అభిమానించే ప్రజానీకాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి స్వర్గీయ ఎన్టీఆర్ను ఆయన ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి జగన్కు మద్దతు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications