నాలుగో కృష్ణుడి కోసం కాంగ్రెసు ప్రయత్నాలు: హరికృష్ణ

నాలుగో కృష్ణుడు రాష్ట్రంలో ఎప్పుడైనా రావచ్చన్నారు. ఢిల్లీ పెద్దలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యవసాయం గురించే ఏమాత్రం తెలియదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని చాలామంది మంత్రులకు వారి వారి శాఖల పైనే పూర్తి అవగాహన లేదన్నారు.
రానున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోని ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు.
నీతి, నిజాయితీలకు మారుపేరైన శ్రీనివాస్ రెడ్డిని బదలీ చేయడం దారుణమన్నారు. ఈ బదలీపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. మద్యం సిండికేట్ల విషయంలో శ్రీనివాస్ రెడ్డి సొంత తమ్ముడి పైనే విచారణ చేపట్టారని ప్రశంసించారు. రాష్ట్రంలో కుక్కమూతి పిందేలు మాదిరి కాంగ్రెసు తయారైందన్నారు.
కాగా ఢిల్లీలో వ్యాఖ్యల అనంతరం ఆయన తనకు టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో ఎలాంటి విభేదాలు లేవని మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లాలో చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని టిడిపి చేసిన ఆందోళనలో హరికృష్ణ అప్పుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెసుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంస్కరణల కారణంగానే కాంగ్రెసు లబ్ధి పొందుతోందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అప్పుల ఊబిలో ముంచుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రికే బెదిరింపులు వస్తే ప్రజల పరిస్థితి ఏమిటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పాలన బృహన్నలగా ఉందన్నారు. కాంగ్రెసు వారు నాటకలలో ఉండేవారిలా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications