నాకూ బాధగానే ఉంది, తప్పలేదు: కరెంట్ చార్జీలపై సిఎం
విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్తు వినియోగం కూడా పెరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోలుకు రూ. 200 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కొనుగోలు ధర రూ.1.15 పైసల నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆయన అన్నారు. మే మాసానికల్లా విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు అదనపు విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని, దాంతో విద్యుత్తు కోతను నివారిస్తామని ఆయన చెప్పారు. సింహాద్రి నుంచి త్వరలో 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.
రోజుకు 296 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 254 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కోతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రోజుకు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. బొగ్గు ధర 103 శాతం, గ్యాస్ ధర 93 శాతం పెరిగాయని, రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపు కూడా 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గిందని ఆయన అన్నారు.
దేశంలో అత్యధిక సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం మనదేనని, 5,530 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి అదనంగా 8 లక్షల కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ ఖర్చులను నీటి పారుదల అభివృద్ధి సంస్థనే భరిస్తుందని ఆయన చెప్పారు. గృహ వినియోగానికి 50 యూనిట్ల వినియోగం వరకు అదనపు భారం ఉందని ఆయన చెప్పారు.