వైయస్పై విమర్శల చిచ్చు: కిరణ్పై మంత్రులు సీరియస్

వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు నాయకులు విమర్శిస్తున్న వైనాన్ని సీనియర్ మంత్రులు కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. వైయస్ను విమర్శించడంపై వారు గుర్రుమంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారన్నారు. ఓ టీవీ చానెల్ లైవ్ కార్యక్రమంలో వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ్రు మురళిపై వట్టి వసంతకుమార్ విరుచుకపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని, దళితులకు వైయస్ చేసిందేమీ లేదని కొండ్రు మురళి అన్నారు.
ఈ స్థితిలో వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించవద్దని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశంలో స్పష్టత ఇస్తానని కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో కొంత మంది కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతితో వైయస్ రాజశేఖర రెడ్డిని వేరు చేయలేమని కొంత మంది నాయకులు ఇటీవలే అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి దళితులకు అన్యాయం చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జెడి శీలం కూడా విమర్శించారు. వైయస్పై తేల్చుకోవాలని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు మంగళవారంనాడు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా వైయస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై కొంత మంది కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్సలను మొత్తం కాంగ్రెసు పార్టీకి అంటగడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా దాడి చేస్తున్నారు.
కాంగ్రెసు నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగింపజేసే ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే ప్రజలకు మేలు జరిగిందని, వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కాంగ్రెసు పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు నాయకులు వైయస్ వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ప్రయత్నాలు ఫలించినట్లే అవుతాయి.












Click it and Unblock the Notifications