హైకోర్టు ఆదేశాలతో చిక్కుల్లో మోపిదేవి, బొత్స

ఎసిబి సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న శ్రీనివాస రెడ్డి బదిలీపై పునరాలోచన చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా కష్టాలను తెచ్చి పెట్టే అవకాశం ఉందని అంటున్ారు. లిక్కర్ సిండికేట్ల నుంచి మోపిదేవి వెంకటరమణ లంచాలు తీసుకున్నట్లు నున్నా రమణ అనే వ్యక్తి చెప్పినట్లు ఎసిబి ఆరోపించింది. విజయనగరం జిల్లా మద్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్స సత్యనారాయణ బంధువులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మద్యం కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను కోర్టు అనుమతి లేకుండా బదిలీ చేయవద్దని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మద్యం దుకాణాల యజమానుల్లో తెల్లరేషన్కార్డులదారుల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పడానికి ఆదాయపు పన్ను శాఖను రంగంలోకి దించాలని సూచించింది. కేసుల దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉండకూడదని తేల్చి చెప్పింది. ఏదైనా ఇబ్బంది కలిగితే తమను సంప్రదించాలని హైకోర్టు ఎసిబికి సూచించింది.
తెల్ల రేషన్ కార్డులున్నవారికి కూడా మద్యం దుకాణాలున్నాయని ఎసిబి చీఫ్ భూపతి బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెసు నాయకులు దాన్ని మరో విధంగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డులున్నంత మాత్రాన వ్యాపారం చేయకూడదా అని, వారికి మద్యం దుకాణాలు ఉంటే తప్పేమిటని అడుగుతున్నారు. అయితే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఇస్తుంది. అంటే, మద్యం దుకాణాలు నడిపే ఆర్థిక స్తోమత వారికి ఉండదనే ఎసిబి చీఫ్ వ్యాఖ్యలను రాజకీయ నాయకులు మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద, మద్యం సిండికేట్ల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు రాజకీయ నాయకులకు కంటగింపుగా మారే ప్రమాదం ఉంది.
ఇదిలా వుంటే, ఎసిబి డిజి భూపతి బాబు మంగళవారం సంచలనాత్మక ప్రకటన చేశారు. బినామీలు అందుబాటులోకి రాకుండా అసలు నిందితులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బినామీలు భయపడకుండా ఎసిబికి సహకరించాలని ఆయన కోరారు. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మద్యం దుకాణాల వేలం అక్రమాలపై ఆరు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఏయే జిల్లాల్లో తెల్ల రేషన్ కార్డులున్నవారి పేర ఎన్నెన్ని దుకాణాలు ఉన్నాయో ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications