రిక్షా తొక్కి ఆనం వివేకా కొత్త స్టంట్, జత కల్సిన ఎమ్మెల్యే

ఆనం వివేకానంద రెడ్డికి మరో శాసనసభ్యుడు శ్రీధర కృష్ణా రెడ్డి కూడా తోడయ్యారు. ఆనం రిక్షా ఎక్కి ఎంజాయ్ చేస్తుండగా శ్రీధర కూడా మరో రిక్షా తీసుకొని ఎక్కి తొక్కాడు. అయితే ప్రజాపథం కార్యక్రమానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు ఇద్దరు ఎమ్మెల్యేలు రిక్షాతో స్టంట్స్ చేయడం గమనించి చెవులు కొరుక్కున్నారు.
కాగా ప్రజాపథంలో ప్రజల నిలదీత మంగళవారం కూడా కొనసాగింది. ఒంగోలు ప్రజాపథంలో అధికారులకు ఓ మహిళ ఝలక్ ఇచ్చింది. మరాఠీపాలెం నారాయణ పాఠశాలలో జరిగిన ప్రజాపథంలో పావలా వడ్డీ కింద ఆమె చెక్కు తీసుకుంటూనే అధికారులు, పాలకులపై విమర్శలు చేసింది. త్వరలోనే కాంగ్రెసు పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించడం అధికారులను ఖంగుమనిపించింది.
కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం పెద్దంపేటలో గ్రామస్థులు ప్రజాపథాన్ని అడ్డుకున్నారు. సాగునీటి సమస్యలపై వారు అధికారులను నిలదీశారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదంటూ పలువురు మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని నిలదీశారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుబ్బగుర్తిలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కాగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల మంత్రులు, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్న ప్రజాపథాన్ని ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications