జగన్ లక్ష్యం: క్రైస్తవ మత పెద్దల మధ్య బాబు బర్త్ డే
వైయస్ జగన్ వెంట దళిత క్రైస్తవులు ఉన్నారనే సమాచారంతో చంద్రబాబు ఆ రకమైన సమావేశానికి పూనుకున్నారని అంటున్నారు. క్రైస్తవులను తమ వైపు తిప్పుకోవడానికి, తద్వారా వైయస్ జగన్ను దెబ్బ కొట్టడానికి ఆయన ఈ సమావేశం ద్వారా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. క్రైస్తవ, మైనారిటీల ఆస్తులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకంగా తమ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని, సెజ్ల కోసం స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తామని ఆయన చెప్పారు. కొందరు బడా నేతలు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతుల పొట్టలు కొడుతున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే సెజ్లను రద్దు చేసి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. కాకినాడ సెజ్ కోసం ప్రభుత్వం 650 రూపాయల రుణం తీసుకుని 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన చెప్పారు.
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మతఘర్షణలను అరికడతామని, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవుల మద్దతు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీ కూడా భావిస్తోంది. పైగా దళిత క్రైస్తవులు జగన్ వెంట నడుస్తారని అంటున్నారు. ఈ తరుణంలో కాంగ్రెసు పార్టీ నాయకత్వం తమ దళిత నాయకులతో వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయిస్తుండగా, చంద్రబాబు తన జన్మదిన వేడుకలను క్రైస్తవ మత పెద్దల సమక్షంలో జరుపుతున్నారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో అన్నారు. వాయలార్ రవి రాష్ట్రానికి ఎందుకు వచ్చారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. ఆస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ వైయస్ జగన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన అడిగారు.