తెలంగాణభవన్: కెసిఆర్పై కోర్టుకెక్కిన మేనల్లుడు ఉమేష్
హైదరాబాదులోని తెలంగాణ భవనం తెలంగాణ ప్రజల సొత్తు అని ఉమేష్ రావు గతంలో నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ భవనం కెసిఆర్ జాగీరు కాదని, ఆయన గారడీ మాటలు నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ ఆర్థిక లావాదేవీలు నడుపుతూ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని కూడా విమర్శించారు.
ఉప ఎన్నికల సమయంలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని ఆయన చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ భవనంలో కెసిఆర్ వ్యాపారాలు చేస్తున్నారని, అందులో టివి నడుపుతూ బిజినెస్ చేయడం సరికాదని, అది ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాల కోసం ఇచ్చిందన్నారు. వ్యాపారాలు చేస్తే దానిని ప్రభుత్వం వెంటనే స్వాధీన చేసుకోవాలని సూచించారు.
కెసిఆర్ అక్రమాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని కూడా ఆయన గతంలో సవాల్ విసిరారు. రాజకీయ పార్టీ కలాపాల కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కెసిఆర్ మాత్రం తెలంగాణ భవనాన్ని వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాలు, కుటుంబ సభ్యుల స్వార్థం కోసం కెసిఆర్ తెలంగాణను అడ్డు పెట్టుకున్నారని విమర్శించారు. ఆయనకు చాలా మంది బినామీలు ఉన్నారన్నారు.
టి న్యూస్లో కెసిఆర్ బినామీలు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఒరిగేదేమీ లేదన్నారు. గల్లీ పార్టీలతో తెలంగాణ రాదని ఢిల్లీ పార్టీలతోనే తెలంగాణ సాధ్యమని ఆయన టిఆర్ఎస్ను ఉద్దేశించి విమర్శించారు. కెసిఆర్ అక్రమాలపై మరిన్ని విషయాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. తెలంగాణ భవనంలో నిర్వహిస్తున్న న్యూస్ ఛానల్ను వెంటనే అక్కడి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన అప్పుడే చెప్పారు. అన్నీ తెలిసిన కెసిఆర్ చట్టాలను ఉల్లంఘించి పార్టీ కార్యాలయంలో టివి ఛానల్ నిర్వహించడమేమిటన్నారు. టిఆర్ఎస్ భవనంలో ట్రస్టు సభ్యులు ఎవరెవరో ధైర్యముంటే బయట పెట్టాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు.