మ.నగర్లో బిజెపి ఎఫెక్ట్: టిఆర్ఎస్కు సిపిఐ మద్దతు

తొలుత తాము పరకాల బరిలో నిలవనున్నామని నారాయణ టిఆర్ఎస్ అధినేతతో చెప్పారట. అయితే ఆ తర్వాత తీవ్ర తర్జన భర్జనల అనంతరం తమ వైఖరి మార్చుకున్నారని అంటున్నారు. అదే సమయంలో పరకాలలో తమకు మద్దతు ప్రకటిస్తే భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి వెళ్లేందుకు మరింత అవకాశం ఉంటుందని కెసిఆర్ సిపిఐ నేతలకు సూచించారట.
అయితే సిపిఐ తన వైఖరి వ్యూహం ప్రకారం మార్చుకున్నదని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించింది. పరకాల నియోజకవర్గంలోనూ తెరాస కంటే బిజెపికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ వాద పార్టీలు చీలిపోతే జగన్ వర్గం నేత కొండా సురేఖ గెలుపు ఖాయమని చెబుతూనే అటు ఇటు అయితే బిజెపియే గెలుస్తుందని తెరాసకు అవకాశాలు లేవని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపిని సైద్ధాంతికపరంగా తీవ్రంగా వ్యతిరేకించే సిపిఐ మ.నగర్ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే తెరాసకు మద్దతివ్వడమే ఉత్తమమని భావిస్తోందని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెసును అదే సమయంలో కొండా సురేఖను ధీటుగా ఎదుర్కోవాలంటే తెరాసకు మద్దతిచ్చి చేతులు దులుపుకోవడమే మంచిదని భావించినట్లుగా సమాచారం.
కాగా మొత్తంగా ఉప ఎన్నికలకు దూరంగా ఉండిపోవాలని భావిస్తున్నా, అనంతపురంలో టిడిపి మద్దతు ఇస్తే మాత్రం బరిలోకి దిగాలని సిబిఐ చూస్తోంది. అందుకు టిడిపి అంగీకరిస్తే, పరకాల మినహాయిస్తే అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీకి అండగా నిలవాల్సి ఉంటుంది. మరోవైపు టిడిపితో పొత్తు పెట్టుకోవడం లేదని గురువారం సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications