లొంగిన సాయిరెడ్డి, బోగస్ కంపెనీలంటూ సిబిఐ చార్జిషీట్

సోమవారం దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో తొలి నిందితుడిగా వైయస్ జగన్ను, రెండో నిందితుడిగా విజయ సాయి రెడ్డిని, మూడో ముద్దాయిగా జగతి పబ్లికేషన్స్ చేర్చింది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్లో నిధులు ఎలా మళ్లాయనే విషయాన్ని చార్జిషీట్లో సిబిఐ వివరించింది. ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని కూడా తెలిపింది.
విజయసాయి రెడ్డి లొంగిపోయే సమయంలోనే సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయడం పట్ల ఆయన తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. చార్జిషీట్ కాపీ కావాలని అడిగారు. అయితే, కోర్టు అనుమతితో చార్జిషీట్ తీసుకోవాలని సిబిఐ విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాదికి సూచించింది. గత నెల13వ తేదీన నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విజయసాయి రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నెల 20వ తేదీన హైకోర్టు ఆ బెయిల్ను రద్దు చేసింది.
జగతి పబ్లికేషన్స్లో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారే పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది. హెటిరో డ్రగ్స్ రూ. 4 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ. 40 కోట్లు, పొట్లూరి వరప్రసాద్ రూ. 146 కోట్లు, పెన్నా సిమెంట్స్ రూ. 45 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ తన చార్జిషీట్లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ల్యాంకో గ్రూప్ రూ. 30 కోట్లు, సజ్జల గ్రూప్ రూ. 49 కోట్లు, పురుషోత్తమ నాయుడు రూ. రూ. 35 కోట్లు, రమణారెడ్డి రూ. 28 కోట్లు, నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 100 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
సొంత కంపెనీలు రూ. 73 కోట్ల రూపాయలు పెట్టబుడులు పెట్టినట్లు తెలిపింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలకు చెందిన 16 కంపెనీల నుంచి 107 కోట్లు రూపాయలు, హౌరా, కోల్కత్తా, ముంబై, రాజ్కోట్, బెంగళూర్, ఢిల్లీ, తమిళనాడులకు చెందిన 22 కంపెనీల నుంచి 195 కోట్ల రూపాయలను జగతి పబ్లికేషన్స్కు మళ్లించినట్లు సిబిఐ వివరించింది.
అధికారుల సోదాల్లో జగతి పబ్లికేషన్స్కు నిధులు మళ్లించిన బోగస్ కంపెనీల గుట్టు బయటపడిందని అంటున్నారు. నల్లధనాన్ని తెలుపుగా మార్చడానికి నిధుల మళ్లింపు చేపట్టారని, ఇందులో కీలక సూత్రధారి విజయసాయి రెడ్డి అని సిబిఐ ఆరోపించింది. జగతి పబ్లికేషన్స్లోకి భారీ పెట్టుబడులు రావడం వెనక కుట్ర ఉందని చెప్పింది. ఎమ్మార్ కుంభకోణం కేసులో కూడా సిబిఐ అదనపు చార్జిషీట్ను దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications