ప్లకార్డుపై జగన్కు కెటిఆర్ విరుగుడు, వైయస్పై ధ్వజం
జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుంటే, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు వెళ్లాలంటే పాసుపోర్టు కావాలా అని అన్నారని గుర్తు చేశారు. వీటిపై జగన్ క్షమాపణ చెప్పిన తర్వాతనే వరంగల్ జిల్లాలోని పరకాలలో అడుగు పెట్టాలని హెచ్చరించారు.
పరకాలలో తెరాస అభ్యర్థిని గెలిపించుకొని జగన్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణపై జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వనని చెప్పినందున ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రత్యేక కార్యాచరణకు దిగాలన్నారు.
కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు ప్రాజెక్టును మళ్లీ ఎందుకు ప్రారంభిస్తున్నారని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డిలు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. పరకాలలో తెరాస విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కొండా సురేఖ వచ్చినా మరెవరు వచ్చినా తెలంగాణలో ఆంధ్రా పార్టీలకు స్థానం లేదని చెప్పారు. జగన్, తెలుగుదేశం పార్టీని, కాంగ్రెసు పార్టీని ఇక్కడ తిరస్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార ఎంపీలను పార్లమెంటు నుండి బహిష్కరించడం కేంద్రం అప్రజాస్వామిక తీరుకు నిదర్శనమన్నారు.
వందలాది మంది ప్రాణత్యాగాలకు కారణమైన కాంగ్రెసుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీలు వెంటనే భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించాలని సూచించారు. పరకాలలో తెలంగాణ ప్రజలు తెలంగాణవాదం బలంగా వినిపిస్తారని ఆయన చెప్పారు.
కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయు జెఏసి ఆధ్వర్యంలో కాంగ్రెసు పార్టీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల అభిష్టాన్ని పార్లమెంటులో ప్రతిబింభిస్తున్న ఎంపీలను సభ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెసుపై ఓయు విద్యార్థులు ధ్వజమెత్తారు.