జగన్కు పరోక్ష హెల్ప్: సోనియాకు వాయలార్ ఫిర్యాదు

జగన్ పైన పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేయకపోవడం కొంపముంచుతోందని ఆయన సోనియాకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. సోనియాకు సమర్పించిన నివేదికలో ఆయన రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. కాగా వచ్చే ఉప ఎన్నికల్లో కనీసం ఆరు సీట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని సమాచారం. సోనియా గాంధీ సూచనల మేరకు కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్గ్ గులాం నబీ ఆజాద్తో కలిసి వాయలార్ రవి కలిసికట్టుగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వారం రోజుల్లో ఖరారు చేసి రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి సమర్పించినట్లు సమాచారం. అందులో అధికులు ఒక వర్గానికి చెందిన వారు కావడంతో ప్రత్యామ్నాయ పేర్లను సూచించవలసిందిగా సిఎంకు ఆజాద్, వయలార్ సూచించారట.
జిల్లాస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని, మే నెలలో జిల్లాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు, సదస్సులు నిర్వహించాలని ఆజాద్, వయలార్ సూచించారు. కాగా వాయలార్ రవి ఇటీవల రాష్ట్రానికి వచ్చి కాంగ్రెసు నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇతర నేతల మధ్య సయోధ్యకు కృషి చేశారు. కాగా గులాం నబీ ఆజాద్ త్వరలో రాష్ట్రానికి రానున్నారు. వాయలార్ కూడా వెళ్లేటప్పుడు తాను వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications