బొత్స, కిరణ్కు సోనియా క్లాస్, చిరుతో వెళ్లాలని సూచన

ఉప ఎన్నికల్లో గెలిస్తేనే మర్యాద దక్కుతుందని, లేకపోతే, పార్టీకే కాదు, వ్యక్తిగతంగా మీరూ నష్టపోవాల్సి వస్తుందని ఆమె వారిని హెచ్చరించారట. చివర్లో ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకొంటే ఉపేక్షించేది లేదని, ఫిర్యాదులతో వచ్చే ఏ ఒక్కరికీ ఇక తాను అనుమతివ్వనని తేల్చి చెప్పారట. 18 నియోజక వర్గాల బాధ్యుల జాబితాను తనకు ఇవ్వాలని, ప్రతి సెగ్మెంట్ ఇన్చార్జి పనితీరును స్వయంగా తానే పరిశీలిస్తానని చెప్పారు.
మొదట మీరు తీసుకోవాల్సిన బాధ్యతలు చెప్పాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల పైన కాకుండా గెలిచే వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఎన్నికల తర్వాత సాకులతో వస్తే షాక్లు తప్పవని హెచ్చరించారు. కిరణ్, బొత్సతోపాటు ఇతర నాయకులకూ ఆమె బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్, కిరణ్, బొత్స, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం మంగళవారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యారు.
వరుసగా రెండో రోజు అభ్యర్థుల జాబితాపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో తీసుకోవాల్సిన బాధ్యతలపై సోనియా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏయే నియోజకవర్గంలో ఏ వర్గం ప్రజలు అధికంగా ఉన్నారు? ఎక్కడ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తున్నారు? వంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చిన్న చిన్న అంశాలపై కూడా కిరణ్, బొత్సలకు ఆమె జాగ్రత్తలు చెప్పారు.
ప్రచారంపైనా పార్టీ నాయకులకు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఆర్థికపరమైన అంశాలు, ప్రచారం పైనా ఆమె నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు, కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తొలుత నాయకులు చెప్పిన అంశాలను సావధానంగా విన్న సోనియా.. ఆ తర్వాత వారికి తాను చెప్పదల్చుకున్నది చెప్పారు. ఇన్చార్జిల సిన్సియారిటీని గుర్తిస్తామన్న విషయాన్ని కూడా వారితో చెప్పాలని కిరణ్, బొత్సలకు ఆమె సూచించారు.
అభ్యర్థులకు వనరులు కల్పించడం ప్రధానం కాదని, ముందుగా గెలిచే స్థానాలను గుర్తించడం ముఖ్యమని స్పష్టం చేశారు. వనరుల విషయంలో మిగిలిన నియోజక వర్గాల కంటే ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యర్థులు రంగంలో ఉన్నచోట్ల ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అన్ని స్థానాలకు ఒకే రకమైన ప్రాధాన్యం ఇచ్చే కంటే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న స్థానాలపై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.
సమన్వయంతో కృషి చేస్తే, మంచి ఫలితాలు వాటంతట అవే వస్తాయని ఆమె చెప్పారు. ప్రధానంగా ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లలో అత్యధికచోట్ల కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని సమన్వయం చేసుకుంటూ ఆ ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications