పార్టీతోనే ఉంటానని వంశీ, వదిలేది లేదని అధిష్టానం

జగన్తో భేటీ వ్యవహారం ఇంత వివాదం అవుతుందని తాను అనుకోలేదని ఆయన అన్నారు. తనకు ఏ విధమైన రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ను కలిసిన అంశంపై పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తాను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. తాను పరిటాల రవి అనుచరుడిని అయినందుకు గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు.
అయితే, వంశీ వ్యవహారాన్ని అంత సులభంగా వదిలేయడానికి పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన తర్వాతనే వంశీ చంద్రబాబును కలవాలని పార్టీ సీనియర్ నేతలు అన్నట్లు తెలిసిందే. పార్టీ సీనియర్ నాయకులతో వంశీ వ్యవహారంపై మాట్లాడినట్లు సమాచారం. వంశీ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు పరిటాల రవి హత్యలో వైయస్ జగన్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని వంశీ చేసిన ప్రకటనపై కూడా పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.
వల్లభనేని వంశీని పార్టీ నుంచి పంపించాల్సిందేనని నందమూరి హీరో బాలకృష్ణ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. వంశీ వివరణ ఇచ్చినా పార్టీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి లేదని అంటున్నారు. వంశీ ఏదో రకంగా పార్టీ నుంచి వెళ్లిపోయి, వైయస్సార్ కాంగ్రెసులో చేరాలనే ఉద్దేశంతోనే ఉన్నారనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అందువల్ల వంశీని అనుగ్రహించకూడదని తెలుగుదేశం నాయకులు పట్టుబడుతున్నారు.
వల్లభనేని వంశీ తీరుపై అనంతపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వైయస్ జగన్ను కలిసిన వ్యవహారంపై తనకు ఫోన్లో వివరణ ఇచ్చినట్లు వంశీ చెబుతుండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వంశీ వ్యవహారంపై ఆయన ఫోన్లో సీనియర్ నేతలతో మాట్లాడారు. తాము పంపిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని అడిగితే చెప్పాల్సింది చంద్రబాబుకు చెప్పానని వంశీ అంటున్నారని సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అసలు వంశీ తనతో ఫోన్లో మాట్లాడలేదని చంద్రబాబు చెప్పారు. మొత్తం వ్యవహారంపై వంశీ తనతో మాట్లాడేదేమీ లేదని, షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చుకోవాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications