బాలకృష్ణ పట్టు: వల్లభనేని వంశీకి ఉద్వాసనే?

వంశీ ఇప్పటి వరకు పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించవచ్చునని తెలుస్తోంది. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమని అంటున్నారు. నిజానికి, విజయవాడ పశ్చిమం ఇంచార్జీ బొండా ఉమామహేశ్వర రావును వంశీ స్థానంలో విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నారు.
అయితే, బొండా ఉమా మహేశ్వరరావు అందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా ఉమామహేశ్వర రావు కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం వల్ల ఆ స్థానంలో నెట్టుకురావడం కష్టమని భావించి విజయవాడ పశ్చిమం నియోజకవర్గం ఇంచార్జి స్థాయికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వంశీ ఉదంతంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొట్టిపాటి నర్సయ్య వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడైన గొట్టిపాటి నర్సయ్య గత ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు రెండు సార్లు మార్టూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా గొట్టిపాటి నర్సయ్య బలమైన నాయకుడే.
గొట్టిపాటి నర్సయ్య సోమవారంనాడు వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైవి సుబ్బారెడ్డిని హైదరాబాదులో కలిసి పార్టీలోకి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోరని తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కానీ, పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications