జగన్ పార్టీలోకి కాదా?: పార్థసారథితో కొడాలి నాని భేటీ

అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వల్లభనేని వంశీతో పాటే వైయస్సార్ కాంగ్రెసులో చేరే అవకాశముందనే వాదనలు వినిపించాయి. ప్రస్తుతం నాని ఎమ్మెల్యే కాబట్టి.. ఇప్పటికిప్పుడు ఆయన జగన్ వైపుకు వెళ్లకపోయినప్పటికీ 2014లోగా ఆయన అటువైపు వెళ్లవచ్చనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది.
అయితే అనూహ్యంగా ఆయన జగన్ వైపు వెళ్లక పోవచ్చుననే వాదన కూడా తాజాగా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆయన జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథితో భేటీ కావడమే. బుధవారం కొడాలి నాని మంత్రి పార్థసారిథితో భేటీ అయ్యారు. వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రితో నాని అరగంట పాటు ప్రత్యేకంగా మాట్లాడారని తెలుస్తోంది.
కృష్ణా జిల్లా టిడిపి నేతలు బందరు పోర్టు కోసం కోనేరు సెంటర్లో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టిడిపికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే నాని మాత్రం ఆ దీక్షలో పాల్గొనకుండా మంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. దీంతో కొడాలి నాని జగన్ వైపుకు కాకుండా కాంగ్రెసు వైపు వెళతారా అనే ప్రశ్న పలువురిలో తాజాగా ఉదయిస్తోంది.
అయితే మంత్రితో తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొడాలి నాని ఆ తర్వాత చెప్పారు. ఓ భూమికి సంబంధించిన అంశంపై వినతి పత్రం ఇచ్చేందుకే తాను మంత్రిని కలిశానని చెప్పారు. తమ భేటీ క్యాజవల్గానే జరిగిందని మంత్రి పార్థసారథి కూడా చెప్పారు.
అయితే భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరువురు కొట్టి పారేసినప్పటికీ.. టిడిపి దీక్ష చేస్తున్న సమయంలో నాని మంత్రితో భేటీ కావటం, దాదాపు అరగంట పాటు ఇరువురు చర్చించటం, అదీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రానున్న సమయంలో కలవడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. వీరు మచిలీపట్నం గెస్టు హౌస్లో భేటీ అయ్యారు. కాగా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వర రావుతో కొడాలి నానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications