నరసింహన్ రెండోసారి: జగన్ను ఎదుర్కొనేందుకేనా?

త్వరలో రాష్ట్రంలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల తర్వాత జగన్ పార్టీ భారీ విజయం సాధిస్తే కాంగ్రెసు నుండి సుమారు ముప్పై నుండి యాభై మంది ఎమ్మెల్యేల వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. దీనిని ఎదుర్కోవాలంటే నరసింహన్ సరైన వ్యక్తి అని కాంగ్రెస్ పెద్దలు భావించి ఉండవచ్చునని అంటున్నారు.
ఒకవేళ ఉప ఎన్నికలలో కాంగ్రెసు చతికిల పడి, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముంటే, ఆ సమయంలోనూ అన్ని సమస్యలను ఎదుర్కోవాలంటే నరసింహనే సరైన వ్యక్తి అని కేంద్రం భావించి ఉంటుందని అంటున్నారు. నరసింహన్ కూడా కేంద్రానికి ఇచ్చిన నివేదికలో.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఉప ఎన్నికల తర్వాత ముప్పు తప్పక పోవచ్చునని తెలిపారట. సర్కారుకు పొంచి ఉన్న ముప్పుతో పాటు పరిష్కార మార్గాల పైనా ఆయన కేంద్రానికి నివేదిక అందించారని అంటున్నారు.
ఆయన నివేదికతో సంతృప్తి చెందిన కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని సంప్రదించి ఇలాంటి వ్యక్తి అయితేనే రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోగలరని సూచించారట. దీంతో సోనియా ఆమోద ముద్ర వేశారని అంటున్నారు. అలాగే ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. ఇలాంటి పరిస్థితులకు ఆల్టర్నేట్ నరసింహనే అని కేంద్రం భావించి ఉంటుందని అంటున్నారు.
కాగా గురువారం ఉదయం ఆయన గవర్నర్గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రమంతటా పర్యటిస్తానని చెప్పారు. సంక్షేమ ఫలాలు అందరికి అందేలా చూస్తానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు బాగానే ఉన్నాయన్నారు.
అయితే ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రమంతటా పర్యటిస్తానన్న ఆయన వ్యాఖ్యలపై కూడా రాజకీయ కోణంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలలో జగన్ పార్టీ దూసుకుపోతే నరసింహన్ రాష్ట్రంలో కీలకం కానున్నారా అనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications