జగన్ సాక్షి మీడియాకు మరో దెబ్బ, యాడ్స్ నిలిపివేత
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఖాతాలను సిబిఐ స్తంభింప చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జగన్ మీడియాకు యాడ్స్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలుస్తోంది. సిబిఐ అభియోగాలు మోపినందున యాడ్స్ జారీ చేయడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సాక్షికి ప్రకటనలు ఇవ్వరాదని ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులను అర్ధరాత్రి జారీ చేసింది.
ప్రకటనలు ఇవ్వవద్దని 2097 జివోను ప్రభుత్వం జారీ చేసింది. సాక్షి ప్రకటనలకు సంబంధించిన 46 ఫైళ్లను సిబిఐ తీసుకు వెళ్లింది. సిబిఐ ఖాతాలను స్తంభింప చేసినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ వెల్లడించింది.
సిబిఐ అభియోగాలు తేలేంత వరకు ప్రకటనలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సాక్షికి ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేయడం జగన్ మీడియాకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. కాగా ఎస్బిఐ, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్ అకౌంట్లను సిబిఐ స్తంభింప చేసిన విషయం తెలిసిందే. అయితే మరో బ్యాంక్ అకౌంట్ను కూడా సిబిఐ ఫ్రీజ్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ బ్యాంక్ అకౌంట్ల కారణంగా దాదాపు రూ.110 కోట్ల రుపాయల లావాదేవీలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
కాగా ఆస్తుల కేసులో జగన్తో సహా ఇతర నిందితులకు సిబిఐ కోర్టు సోమవారం జారీ చేసిన సమన్లు త్వరలో వారికి అందనున్నాయి. ఈ సమన్లను బుధవారం కోర్టు నుంచి సిబిఐ తీసుకుంది. త్వరలోనే వారందరికీ అందించనుంది. వాటిని అందుకున్న వారు కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న గగన్ విహార్లోని సిబిఐ మొదటి అదనపు ప్రత్యేక కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.
మీరొక్కరే వ్యక్తిగతంగా కానీ, న్యాయవాదితోపాటుగానీ 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు కోర్టుకు రావాలంటూ సమన్లలో పేర్కొన్నారు. జగన్కు లోటస్ పాండ్ చిరునామాతో సమన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో విజయసాయిరెడ్డి ఇది వరకే అరెస్టు అయి, బెయిల్ కూడా పొందినందున 28వ తేదీన హాజరు నుంచి ఆయనకు మాత్రం మినహాయింపు ఉంటుందని సీబీఐ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఖాతాల స్తంభనపై సాక్షికి కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ ఈ రోజు కౌంటర్ దాఖలు చేయనుంది. విచారణ ఈ రోజే జరగనుంది.