సూరీడి వాంగ్మూలం: సునీల్ రెడ్డి చుట్టూ ఉచ్చు
సూరీడు తన వాంగ్మూలంలో వెల్లడించిన అంశాలతో సునీల్ రెడ్డి చిక్కుల్లో పడినట్లేనని భావిస్తున్నారు. సూరీడు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రతి తన వద్ద ఉద్దంటూ ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ గురువారం ఓ వార్తకథనాన్ని ప్రసారం చేసింది. వాంగ్మూలం ప్రతిని కూడా టీవీ చానెల్ చూపించింది. ఈ వార్తాకథనం ప్రకారం - వైయస్ రాజశేఖర రెడ్డి 1977లో తనకు పరిచయమయ్యారని సూరీడు చెప్పారు. మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి మరణించే వరకు తాను వైయస్ వెన్నంటే ఉన్నానని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తాను వడ్డించిన భోజనమే చేసేవారని ఆయన చెప్పారు. కష్ట సమయంలో సునీల్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డిని ఆశ్రయించారని, ఆ తర్వాత వైయస్ జగన్కు దగ్గరయ్యాడని ఆయన చెప్పారు. వైయస్ జగన్ కుటుంబానికి సునీల్ రెడ్డే డబ్బు తెచ్చి ఇచ్చేవాడని ఆయన అన్నారు.
తాను వైయస్ రాజశేఖర రెడ్డి వద్దకు వచ్చేటప్పటికి వైయస్ జగన్కు ఐదేళ్ల వయస్సు ఉంటుందని ఆయన చెప్పారు. తాను వైయస్ కుటుంబం కోసం 40 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. సునీల్ రెడ్డి వైయస్ జగన్ భార్య భారతికి సమీప బంధువని, గత ఐదేళ్లుగా జగన్ వ్యాపార లావాదేవీల్లో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు. ఎమ్మార్ వ్యవహారాలను సునీల్ రెడ్డి పర్యవేక్షించేవాడని, సునీల్ రెడ్డికి డబ్బులు సంపాదించే స్తోమత లేదని ఆయన అన్నారు.