సిబిఐ వెనుక రామోజీ, జగన్కు వేధింపు: లక్ష్మీపార్వతి
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావులు ఒక్కటై జగన్ను వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సాక్షిపై దాడి మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. సిబిఐ సంస్థ కాంగ్రెసు కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కూడా సిబిఐ తీరును తప్పు పట్టారని ఆమె గుర్తు చేశారు.
కాగా సాక్షి పత్రిక, టివి బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాదులో ఎపియుడబ్ల్యుజే ఆందోళనలు చేపట్టింది. సాక్షి బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడంపై సిబిఐ పునరాలోచించుకోవాలని డిమాండ్ చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీగా బయలుదేరారు.
పది నెలల నుంచి సాక్షి యాజమాన్యంపై విచారణ జరుపుతున్నారని, వైయస్ జగన్ ఈ నెల 28న కోర్టుకు రానున్న సమయంలో సిబిఐ ఆ పత్రిక, టివి అకౌంట్లను నిలిపివేయడం సరికాదన్నారు. పత్రికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే హక్కు సిబిఐకి లేదన్నారు. సిబిఐ చర్యలో రాజకీయ అంశాలు ఉన్నాయని విమర్శించారు.