రాజ్యసభలో గ్యాస్ లీక్, దుర్వాసన: ఎసి మెషిన్ల నుండే
గ్యాస్ లీకై దుర్వాసన రావడంతో సభ్యులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎసి మెషీన్లు లీకై దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్, వ్యవస్థ కుళ్లి పోయింది.. రాజ్యసభలోనూ కుళ్లిన వాసన వస్తోందని చలోక్తి వేశారు. రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర ప్రసాద్ దుర్వాసన వస్తున్నట్లుగా మొదట గుర్తించారు.
ఐదు నిమిషాలు పాటు అంతా గమనించి, ఆ తర్వాత వీరేంద్ర ప్రసాద్ దుర్వాసన వస్తున్నట్లు చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పదకొండు గంటల ఇరవయ్యేడు నిమిషాలకు చోటు చేసుకుంది. ఇంతకుముందు నాలుగు రోజుల క్రితం సోమవారం కూడా లోకసభలో ఇలాంటి పరిస్థితి సంభవించింది. అయితే ఆ సమయానికి అప్పటికే లోకసభ అయిపోయింది. సభ్యులు వెళ్లి పోయారు.
సభలోని ప్రతి ఒక్క సభ్యుడికి ఏదో చెడు వాసనలా అనిపించిందని, అయితే దానికి కారణం మాత్రం ఎవరికీ తెలియలేదని, దీంతో సభను వాయిదా వేయడమే మంచిదని రాజ్యసభ చైర్మన్ చెప్పి సభను వాయిదా వేశారని సిపిఐ నేత డి.రాజా చెప్పారు.