సాక్షి గుడ్ కంపెనీ, పాపులర్..: జాతీయ ఛానల్తో జగన్

సిబిఐ ప్రతి చర్య రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీలో ముఖ్యమైన నేత అని, ఆయన చనిపోయాక తాను కాంగ్రెసు పార్టీని వీడినట్లు చెప్పారు. తన తండ్రి బతికున్నప్పుడు గౌరవించిన కాంగ్రెసు పార్టీ ఆయన చనిపోయాక తన పైనా, తన తండ్రి పైన విమర్శలు చేస్తోందన్నారు.
ఈ కేసులు తన ఇమేజ్ని దెబ్బ తీయలేవన్నారు. తనకు ప్రజల నుండి ఎంత మద్దతు వస్తుందో అందరూ చూస్తున్నారన్నారు. దేవుడు తనతో ఉన్నాడని చెప్పారు. సిబిఐ తన ఇంట్లో సోదాలు చేసిందని, కానీ ఎలాంటి ఆధారాలను కనుక్కోలేక పోయిందని అన్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే సిబిఐ తన ఆస్తుల కేసులో మూడు ఛార్జీషీట్లు జారీ చేసిందని చెప్పారు.
సాక్షి టివి చాలా మంచి కంపెనీ అని, సాక్షిలో తాను కూడా ఒక ఇన్వెస్టర్(పెట్టుబడిదారుడు)ను అని చెప్పారు. తాను సాక్షి టివి, పత్రిక నుండి ఏం పొందానని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక కంపెనీ మాత్రమే అన్నారు.
కాగా మరో ఛానల్తో ఎవరైనా తననెందుకు అరెస్టు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాను చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. రాజకీయంగా తాను వేరే వైఖరి తీసుకున్నంత మాత్రాన తన ప్రతిష్టను దెబ్బ తీసే స్వేచ్ఛ వారికి వచ్చేస్తుందా అని ఆయన అడిగారు.
చట్టానికి కట్టుబడి పౌరునిగా సిబిఐ సమన్లపై కోర్టుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ఆయన అన్నారు. కోర్టుకు వెళ్తామని, తమ వాదనలు వినిపిస్తామని ఆయన అన్నారు. సిబిఐ తీరులో రాజకీయ స్వభావమే దాగి ఉందని ఆయన విమర్శించారు. పోరాడుతున్నది తాను కాదని, వాళ్లే తనపై దాడి చేస్తున్నారని, వారి చేతిలో అధికారం ఉందని, దాని అండతో తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. దేవుడు తన వైపు ఉన్నాడని, ప్రజలు తన వైపు ఉన్నారని, రాష్ట్రంలో విపక్షంగా తాను కాంగ్రెసుపై పోరాడుతున్నానని ఆయన అన్నారు.
కాంగ్రెసులోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదని, అది ముగిసిన అధ్యాయమని ఆయన అన్నారు. ఇది ధర్మపోరాటమని, సాక్షి కుటుంబం మొత్తం ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని ఆయన అన్నారు. ఇలాంటి స్థితిలో సాక్షి సర్క్యులేషన్ పడిపోదని, మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారని ప్రశ్నిస్తే అలా సంఖ్య చెప్పదలుచుకోలేదని, ఉప ఎన్నికల ఫలితాలను మీరే చూస్తారు కదా అని ఆయన అన్నారు. 18 అసెంబ్లీ స్థానాల్లో, ఓ లోకసభ స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అంటే మొత్తం 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలే న్యాయనిర్ణేతలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసునని, దాని ప్రకారమే ఓటేస్తారని, దేవుడు తన వైపు ఉన్నాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications