పరకాల బరిలో కెయు జెఏసి, తెరాస నుండి 'రెడ్డి'?
పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలో పోటీ చేయడం వారిని అసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరుపార్టీలో పార్టీల ప్రయోజనాల కోసం బరిలోకి దిగితే తెలంగాణవాదం బలహీనపడుతుందని కాకతీయ జెఏసి ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకు చెక్ చెప్పి నేరుగా తామే బరిలోకి దిగాలని యోచిస్తున్నాయని తెలుస్తోంది.
కాగా పరకాల టిక్కెట్ను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు నిర్ణయించినట్లుగా సమాచారం. సహోదర రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ ఎన్నికల సంఘం నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే సహోదర రెడ్డిని అధికారికంగా ప్రకటించే ముందు ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలు తెరాస ఎన్నికల కమిటీ చేస్తోందని తెలుస్తోంది.
కాగా పరకాల నియోజకవర్గంలో పోటీలో నిలిచే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బిజెపి, తెరాస పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మాజీ డిఎస్పీ నళిని కూడా తెలంగాణ కోసమే తాను రాజీనామా చేశానని, తాను ఖచ్చితంగా బరిలోకి దిగుతానని చెబుతోంది. తాజాగా కాకతీయ జెఏసి బరిలోకి దిగేందుకు భేటీ కావడం గమనార్హం.
పరకాలలో బిజెపి, తెరాస ఒకరిపై మరొకరు పోటీ చేస్తే తెలంగాణవాదం ఓడే అవకాశముందని, దీనిపై ఆ పార్టీలో ఆలోచించుకోవాలని తెలంగాణ జెఏసి సూచించింది. శనివారం జరిగిన జెఏసి సమావేశంలో పోటీ నుండి తప్పుకోవాలని బిజెపికి సూచించారు. అయితే అందుకు బిజెపి ససేమీరా అంది. తెరాస ఈ భేటీకి హాజరు కాలేదు. అయితే పోటీలో ఒక్కరే ఉండేందుకు తాము ఇంకా ప్రయత్నాలు చేస్తున్నామని జెఏసి చైర్మన్ కోదండరం చెప్పారు.