వైయస్ జగన్ ఆస్తుల కేసు: నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు
భారతి సిమెంట్స్లో రూ. 244 కోట్లు, జగతి పబ్లికేషన్స్లో రూ. 100 కోట్లు, నండూర్ పవర్లో రూ. 140 కోట్లు, కార్మెల్ ఏసియాలో రూ. 200 కోట్లు పెట్టుబడులుగా ప్రసాద్ పెట్టినట్లు తెలియవచ్చింది. వీటిని ప్రతిఫలంగా వాన్ పిక్లో 15 వేల ఏకరాల భూమిని పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రసాద్పై 120బి, 420, 409, 477 ఏ సెక్షన్లకింద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్టు చేసినట్లు సిబిఐ జెడి లక్ష్మినారాయణ మీడియాతో చెప్పారు. బ్రహ్మానంద రెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారిద్దరిపై ఆధారాలు లభించాయని, దీంతో అరెస్టు చేశామని ఆయన చెప్పారు. రేపు వారిని కోర్టులో ప్రవేశపెడతామని ఆయన చెప్పాు. జగన్ అరెస్టుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
నిమ్మగడ్డ ప్రసాద్కు వైయస్ జగన్కు చెందిన సాక్షి మీడియాలో 26 శాతం పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం. వాన్పిక్ ప్రాజెక్టు ఒప్పందం సమయంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం సిబిఐ అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలోనూ, బ్రహ్మానంద రెడ్డి నివాసంలోనూ సోదాలు చేశారు. తమ వాహనంలో బ్రహ్మానంద రెడ్డిని సికింద్రాబాదులోని తార్నాకలో గల ఆయన ఇంటికి తీసుకుని వెళ్లి సోదాలు చేశారు.
నిమ్మగడ్డ ప్రసాద్ను సిబిఐ అధికారులు సోమవారం ఆరు గంటల పాటు, మంగళవారం నాలుగు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. మాటీవీ, మ్యాట్రిక్స్, సాక్షి మీడియా సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. మాటీవీ గ్రూపు చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. మూతపడిన హెర్రెన్ డ్రగ్స్ను తీసుకుని ఆయన మ్యాట్రిక్స్ లాబొరేటరీగా పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఆయనకు మ్యాట్రిక్స్ ప్రసాద్ అనే పేరు పడింది. ఫార్మా, టెలివిజన్, మెడిసిన్, మీడియా రంగాల్లోకి ప్రసాద్ విస్తరించారు.
కృష్ణా జిల్లాలో 1961లో జన్మించిన నిమ్మగడ్డ ప్రసాద్ 1984లో మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్ను ప్రారంభించారు. 2003లో ఆయన పారిశ్రామికవేత్తగా అవతారం ఎత్తారు. వాన్పిక్ ప్రాజెక్టుకు ఆయన ప్రభుత్వం నుంచి పలు రాయితీలు కూడా పొందారు. వాన్పిక్ వ్యవహారంలో సిబిఐ అధికారులు ప్రభుత్వాధికారులు దేవానంద్, శామ్యూల్, మన్మోహన్ సింగ్, వేంకటేశంలను విచారించినట్లు సమచారం.