తెరాస అభ్యర్థి ప్రకటన: కోదండరామ్పైనే అందరి చూపు

బిజెపి, తెరాసల తీరు పట్ల తెలంగాణ జేఏసీలోని మెజారిటీ సభ్యులు అసహనం ప్రదర్శించారని సమాచారం. ప్రతిసారీ తమపైనే కత్తిపెడితే ఎలా అని వారు మండిపడ్డారని అంటున్నారు. రాజకీయ పార్టీల నుంచి దూరం జరిగి స్వతంత్రంగా ఎదుగుదామని జేఏసీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. అందుకు పరకాల ఉప ఎన్నికనే వేదిక చేసుకుందామని ప్రతిపాదించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వానికే వారంతా మద్దతు పలికారు.
తమ భాగస్వామ్యపక్షాల వైఖరిని తెలంగాణ జెఎసి నాయకులు తప్పు పట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారుపై ఏ దశలోనూ తమను సంప్రదించని ఆయా పార్టీల అధినాయకత్వాలు, ఓటమిపాలైతే మాత్రం నిందిస్తున్నాయని మెజారిటీ సభ్యులు అన్నట్లు తెలుస్తోంది. తెరాస, ఆ పార్టీ అధినేత కెసిఆర్ తీరుపై, పాలమూరు ఉప ఎన్నిక ఫలితంపై, పరకాల ఉప ఎన్నికలపై ఐదు గంటల పాటు స్టీరింగ్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది.
బిజెపి, తెరాస రెండు పార్టీలూ అవసరమేనని మరికొందరు వాదించారు. అదే సమయంలో జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ బలంగా ఉన్నందున తటస్థ వైఖరి కూడా సరికాదని నేతలంతా అభిప్రాయపడ్డారు. అయితే శాస్త్రీయ కారణాలు చూపకుండా ఏదో ఒక భాగస్వామ్య పార్టీకి మద్దతు ప్రకటిస్తే విమర్శలు వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, మెజార్టీ ప్రజలు కోరుకున్న పార్టీకే మద్దతు ఇవ్వాలని తుదకు జేఏసీ నిర్ణయించింది. ఆ పార్టీ ఏదో ఖరారు చేయటానికి జేఏసీ తరఫున ఒక కమిటీని వేయాలని తీర్మానించారు.












Click it and Unblock the Notifications