మే 28న భారీ ప్రదర్శనతో కోర్టుకు వైయస్ జగన్

సిబిఐ దర్యాప్తు వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ తీరును తప్పు పట్టే రీతిలో ఈ నెల 28వ తేదీన వందలాది పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కోర్టుకు చేరుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన నివాసం నుంచి కాన్వాయ్ ద్వారా ఆయన కోర్టుకు చేరుకుంటారు. న్యాయవాది ద్వారా కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ జగన్ స్వయంగా హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తనను సిబిఐ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని ప్రజలకు చాటడానికి ఆయన ర్యాలీని ఉద్దేశించినట్లు చెబుతున్నారు.
ఆస్తుల కేసునలో జగన్ తొలి ముద్దాయి. ఆ రోజు ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరి నాంపల్లిలోని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పుల్లయ్య ముందు హాజరు కావడానికి వస్తారని అంటున్నారు. జగన్ ఇంటి నుంచి నాంపల్లి కోర్టు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగన్ ఇంటి నుంచి పాదయాత్రగా రావాలా, వాహనాల్లో రావాలా అనే విషయంపై ఆలోచన చేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడి శాంతిభద్రతల పరిస్థితిని చెడగొట్టకుండా చూడడానికి ఆ రోజు నిషేధాజ్ఞలు జారీ చేసే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు 144వ సెక్షన్ విధించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంకా రెండు వారాల వ్యవధి ఉండడంతో పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించే పనిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులున్నారు.
ఈ నెల 28వ తేదీన కోర్టుకు వచ్చినప్పుడు వైయస్ జగన్ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, అటువంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మంగళవారం వైయస్ జగన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శానససభా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications