యడ్యూరప్పకు చిక్కులు, నివాసాల్లో సిబిఐ సోదాలు
యడ్యూరప్ప నివాసాలు, కార్యాలయాలపై ఎనిమిది బృందాలు ఏక కాలంలో సోదాలు సాగిస్తున్నాయి. బెంగళూర్ డాలర్స్ కాలనీలోని ఆయన నివాసంలో సోదాలు పూర్తయ్యాయి. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప కుమారులు బివై రాఘవేంద్ర, విజయేంద్ర ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, యడ్యూరప్ప అల్లుడు ఆర్ఎన్ సోహన్ కుమార్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. షిమోగా జిల్లాలోని యడ్యూరప్ప నివాసంలో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
జాయింట్ డెైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల జట్టు బెంగుళూర్లోని డాలర్స్ కాలనీ, రేస్ కోర్స్ రోడ్లలోని యడ్యూరప్ప నివాసాల్లో సోదాలు నిర్వహించింది. యడ్యూరప్ప కుమారుల సంస్థ కార్యాలయంపై కూడా సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. యడ్యూరప్ప నివాసాలు, కార్యాలయాలపై బుధవారం ఉదయం ఆరు గంటల 15 నిమిషాల ప్రాంతంలో దాడులు ప్రారంభమయ్యాయి. ఇవి ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉంది.
బిజెపిపై ధిక్కార స్వరం వినిపిస్తూ ముఖ్యమంత్రి సదానంద గౌడపై యడ్యూరప్ప సమరం ప్రారంభించారు. కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని భావించిన యడ్యూరప్ప బిజెపి అగ్ర నాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బళ్లారిలోని రెండు కార్యాలయాల్లో కూడా సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నారు.