అరెస్టు భయంతోనే పిచ్చి మాటలు: జగన్పై కిరణ్

సిబిఐ విచారణలో ఉన్న వైయస్ జగన్ తమ సంస్థలోకి వేలకోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేత కొందాట శంకర్రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే 14 మంది మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ చేరారు. వైయస్ జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
సిబిఐ దర్యాప్తుతో కాంగ్రెసుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెసు గెలుచుకుంటుందని ఆయన అన్నారు. అరెస్టు అవుతాననే భయంతోనే వైయస్ జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తు విషయంలో వేరేవారిని జగన్ నిందించడం సరి కాదని ఆయన అన్నారు.
వైయస్ జగన్ అసత్యప్రచారం చేస్తున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరాలతో అరెస్టు అవుతానని జగన్ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన సంస్థల్లో వచ్చిన పెట్టుబడులపై వైయస్ జగన్ వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తనను అరెస్టు చేయించడానికి కుట్ర చేస్తున్నారని వైయస్ జగన్ మంగళవారం గుంటూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications