మూడోసారి ప్రమాదం నుంచి బయటపడిన ఎమ్మెల్యే
తాము సురక్షితంగా ఉన్నామని శాసనసభ్యుడు ఫోన్ చేసి తన అనుచరులకు సమాచారం అందించారు. దీంతో వారు ఊరట చెందారు. ఆయన ఉదయం ఎనిమిదిన్నరకు కొప్పల్ వద్ద రైలు ఎక్కారు. ఆయన ఇంజిన్ నుంచి నాలుగో ఎసి కోచ్లో ప్రయాణం చేశారు. తనకు నిద్రలో పెద్ద శబ్దం వినిపించిందని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురికావడం చూశానని ఆయన ఓ పత్రికతో చెప్పారు. సహాయక బృందాలు వచ్చే వరకు తాము బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని ఆయన చెప్పారు
సహాయ బృందాలు అరగంటలో వచ్చాయని, బోగీల నుంచి పది శవాలను వెలికి తీశారని ఆయన చెప్పారు. చిమ్మచీకటి అలుముకుందని, తాను ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన చెప్పారు. ఆరు గంటల వరకు తాను, తన భార్య నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత టాక్సీలో బెంగళూర్ చేరుకున్నామని ఆయన వివరించారు.
ఇలా ఆ శాసనసభ్యుడు ప్రమాదం నుంచి బయటపడడం ఇది మూడోసారి. రెండేళ్ల క్రితం డిప్యూటీ సిఎం ఎంపి ప్రకాష్తో హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. వాతావరణం అనకూలించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. హెలికాప్టర్ కనిపించడం లేదంటూ గగ్గోలు మొదలైంది. ఏడాది క్రితం శాసనసభ్యులు అధ్యయన పర్యటన కోసం ప్రైవేట్ విమానం పంజాబ్లో జలంధర్లో అదుపు తప్పింది. ఈ సమయంలో ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు.