జగన్ పార్టీలో చేరలేదు, రంగారావు ఏమయ్యారు?

ఆయన హైదరాబాదు వచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మాత్రం చేరుకోలేదు. ఆయనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. ఆయన ఫోన్ పని చేయడం లేదు. ఆయన హైదరాబాదు చేరుకున్న తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి రాకుండా ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. కానీ ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. దీంతో ఆయన ఏమయ్యారనేది, ఎటు వెళ్లారనేది స్పష్టం తెలియడం లేదు.
వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన రంగారావు మంత్రి పదవి ఆశిస్తూ వచ్చారు. మంత్రి పదవి వస్తుందని ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూ ఆయన పేరు వెనక్కి పోతూ వచ్చింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేక వర్గంలో ఆయన కొనసాగుతున్నారు. బొత్స సత్యనారాయణతో పడకపోవడంతో తనకు కాంగ్రెసులో రాజకీయ భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
రంగారావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనకు గురువుగా భావించే కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కూడా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ రంగారావు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని సమాచారం. ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు లేని జిల్లా విజయనగరం ఒక్కటే. రంగారావుతో ఈ జిల్లాలో కూడా వలసలు ప్రారంభమైనట్లు చెప్పుకోవాలి.
కాగా, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ శానససభ్యుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం హెచ్చరికలు చేసినప్పటికీ ఏలూరు శానససభ్యుడు ఆళ్ల నాని శనివారం కూడా వైయస్ జగన్ నివాసానికి వచ్చారు.












Click it and Unblock the Notifications