జగన్లో ఆందోళనే ఎక్కువ కన్పించింది: చిరంజీవి ఎద్దేవా
నాలుగైదేళ్లలో పోగేసిన అక్రమార్జనను కాపాడుకోవడానికి, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో పదవి అనేది ప్రజలు దీవించి ఇచ్చేదని, బలవంతంగా లాక్కొనేది కాదని వివరించారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశంతోనే జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేశారని చిరంజీవి ఆరోపించారు. ఈ పదవిని కట్టబెట్టి ఉంటే పార్టీ పెట్టేవారా? అని నిలదీశారు.
ముప్ఫై ఏళ్లపాటు కష్టపడి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఎదిగారని, అందుకు కారణమైన సోనియా గాంధీని దేవతగా ఆయన అభివర్ణించేవారని గుర్తు చేశారు. కానీ సిఎం పదవి కట్టబెట్టనందుకు ఆయన కడుపున పుట్టిన కొడుకు సోనియాను దెయ్యంగా, కాంగ్రెస్ను దుష్టపార్టీగా విమర్శించడాన్ని తప్పుబట్టారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన పత్రిక, చానల్ ద్వారా ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని చిరంజీవి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు అనుమానం కలిగే విధంగా విష ప్రచారానికి దిగారని తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. అటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్లో తనలాంటి నాయకులు ఎందరో ఉన్నారని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునూ చిరంజీవి దునుమాడారు. చంద్రబాబు అధికారం చేపడితే ప్రజలకు కష్టాలు ఫ్రీగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే తుపాకులతో కాల్పించారని గుర్తుచేశారు. అధికార దాహంగల చంద్రబాబు, వ్యక్తిగత స్వార్థం కలిగిన జగన్.. కాంగ్రెస్కు దీటుగా నిలవలేరన్నారు.