జగన్ అరెస్ట్తో ఆ పార్టీలోనే ఉత్సాహం: ఎమ్మెల్యే సీతక్క
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అరెస్టయిన వ్యక్తి కాదని, దోచుకున్నందుకే అన్నారు. అలాంటి వ్యక్తి కోసం ప్రజలు సానుభూతి ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు, జగన్ తల్లి వైయస్ విజయమ్మ తప్పు జరిగిందా లేదా అని చూడటం లేదని, రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారని అన్నారు.
జగన్ కోసం దీక్ష చేసిన వైయస్ విజయమ్మ... వైయస్ రాజశేఖర రెడ్డి మృతి కారణంగా చనిపోయారని వైయస్సార్ కాంగ్రెసు నేతలే చెబుతున్న సామాన్యుల కోసం ఎందుకు దీక్ష చేయలేదన్నారు. జగన్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమ తప్పును గ్రహించి ప్రజలకు తమ ఆస్తులను పంచేందుకు ముందుకు రావడం లేదన్నారు. జగన్ అరెస్టును కూడా రాజకీయ కోణంలో చూపించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు.
తమ బాధను ప్రజల బాధగా చిత్రీకరించాలని వైయస్ కుటుంబం ప్రయత్నిస్తోందన్నారు. వైయస్ మరణంలో కుట్రే ఉంటే తిరిగి దర్యాఫ్తు చేయాలని ఆ రోజే వైయస్ విజయమ్మ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. భర్త మరణాన్ని, కొడుకు అరెస్టును విజయమ్మ రాజకీయం చేయడం సరికాదని, అది దిగజారుడుతనమని మండిపడ్డారు. జగన్ విషయంలో ఆమె తల్లిగా కాకుండా రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారన్నారు.
జగన్ కోసం విజయమ్మ కన్నీరు కార్చి కన్న తల్లి ప్రేమను కన్నీళ్లను కలుషితం చేశారని మరో నేత శోభా రాణి విమర్శించారు. కన్నీళ్లను సైతం మార్కెట్ చేసుకోవాలనుకోవడం విడ్డూరమన్నారు. జగన్ అరెస్టు అవుతాడని, జైలుకు పోతాడని ముందే తెలిసినప్పటికీ... ఏ రోజు కన్నీటి బొట్టు కార్చని ఆమె ఉప ఎన్నికలలో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు కోసం ఏడ్చారన్నారు.