జగన్ ఛానల్పై టిడిపి ఫిర్యాదు, కెసిఆర్కు ఈసి నోటీసు

తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి ఈ మేరకు ఒక లేఖ రాశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ (నియంత్రణ) చట్టం-1995ను జగన్ చానల్ ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. గత సాధారణ ఎన్నికల సమయం నుంచి ఈ ఛానల్లో పెయిడ్ న్యూస్పై తమ పార్టీ పలు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. వీటివల్ల ఉప ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ జగన్ ఛానల్ ప్రసారం చేసే అన్ని ఎన్నికల/రాజకీయ వార్తలు, కార్యక్రమాలు, చర్చలు, ఇంటర్వ్యూలను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో ప్రసారమయ్యే రాజకీయపరమైన కార్యక్రమాలు, చర్చలను పెయిడ్ న్యూస్గా పరిగణించి ఈ మొత్తాలను వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాలలో వేయాలన్నారు.
మరోవైపు పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన మత పరమైన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. దానిపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న పరకాలలో పర్యటించిన కెసిఆర్ బిజెపిని మతతత్వ పార్టీగా అభివర్ణించారు.
తమది సెక్యులర్ పార్టీ కాబట్టే మహబూబ్నగర్లో ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చామని, పరకాలలో ముస్లింలు తమకే మద్దతునివ్వాలని కోరారు. ఈ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసిన కెసిఆర్ గురువారం మధ్యాహ్నం మూడు గంటలలోపు సమాధానం ఇవ్వాలని నోటీసులిచ్చింది. బిజెపి ఫిర్యాదు మేరకే కెసిఆర్కు నోటీసులు జారీ చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications