'కెసిఆర్' నెదిరించే స్థాయి లేదు: కిషన్, జగన్‌పై జగ్గారెడ్డి

Kishan Reddy-Jagga Reddy
వరంగల్/మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఎదిరించే స్థాయి తనకు లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమంలో తప్పటడుగులు వేసి తెలంగాణవాదానికి నష్టం కలిగిస్తున్నారని తెరాసను ఉద్దేశించి కిషన్ రెడ్డి అన్నారు. అందరినీ అనుమానిస్తే తెలంగాణ ఎవరి ద్వారా వస్తుందో చెప్పాలని తెరాస నేతలకు సవాల్ విసిరారు.

ఏ పార్టీతో కుమ్మక్కయ్యే అవసరం బిజెపికి లేదన్నారు. తనను తెరాస నేతలు గల్లీ స్థాయి లీడరన్న బూత్ స్థాయి లీడరన్నా ఫర్వాలేదన్నారు. తన రాజీనామాతో తెలంగాణ వస్తుందంటే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు తనపై వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అమ్ముడుపోయే అలవాటు తమకు లేదని, బిజెపిని విమర్శించే నైతిక హక్కు తెరాసకు లేదన్నారు. జగన్ పార్టీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదన్నారు.

అవినీతి, అక్రమాలలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు బొమ్మా బొరుసులాంటివన్నారు. ఎమ్మెల్యేలను అమ్ముకునే చరిత్ర తెరాసదేనని, తమకు అలాంటి చరిత్ర లేదన్నారు. తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనే అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఐకాస నుండి రోజుకో పార్టీని బయటకు పంపితే తెలంగాణ ఎలా సాధిస్తారని అన్నారు. ఉద్యమంలో భాగంగానే తాము పరకాలలో పోటీ చేస్తున్నామని వివరించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పరకాల పర్యటనను అడ్డుకుంటామని ఓయు ఐకాస ప్రకటించింది. పరకాలకు వచ్చే ముందు విజయమ్మ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వీసా వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇవ్వాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసమే చేశారన్నారు. విజయమ్మ పరకాల పర్యటనను నిరసిస్తూ బుధవారం ఆమె దిష్టి బొమ్మల దహనానికి ఓయు ఐకాస పిలుపునిచ్చింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను కూడా పార్టీలోకి ఆహ్వానించారని సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి మంగళవారం మెదక్ జిల్లాలో అన్నారు. అక్రమ సంపాదన కాపాడుకోవడం కోసమే జగన్ పార్టీ పెట్టారన్నారు. కెసిఆర్ డబ్బు కోసమే తెలంగాణ ఉద్యమం నడుపుతున్నారన్నారు. కెసిఆర్ ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రకటిస్తే తాను పార్టీలో ఉండనని పార్టీ పెద్దలకు చెప్పానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+