వైయస్ జగన్ విచారణ: నాలుగో రోజు ప్రశ్నించిన సిబిఐ
జననీ ఇన్ఫ్రా డైరెక్టర్ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిలతో కలిపి జగన్ను విచారించారు. సిబిఐ జెడి లక్ష్మినారాయణ స్వయంగా జగన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జననీ ఇన్ఫ్రా నుంచి జగతిలోకి పెట్టుబడుల వ్యవహారంపై ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని సిబిఐ ప్రశ్నించింది. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రావడంతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు వదిలేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో తనను సాక్షిగా మాత్రమే సిబిఐ ప్రశ్నించిందని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. సిబిఐ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సచివాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
బుధవారంనాటి విచారణలో సిబిఐ అధికారులు కొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. జగతి పబ్లికేషన్స్లోకి పెట్టుబడుల ప్రవాహం తనకేమీ తెలియదని గతంలో విజయసాయి రెడ్డి చెప్పడం, ఇప్పుడు తనకేమీ తెలియదని, అంతా విజయసాయి రెడ్డి చూశారని జగన్ అనడం వంటి వ్యవహారం వల్ల ఇద్దరిని కలిపి సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
జగతి పబ్లికేషన్స్లోకి పెట్టుబడుల ప్రవాహంపైనా, సాక్షి మీడియా షేర్ల ధరల పెంపు మీద లక్ష్మినారాయణ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. కాగా, జగన్ సిబిఐ కస్టడీ రేపు గురువారం ముగుస్తుంది. మరో రోజు మాత్రమే జగన్ను విచారించడానికి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ సమర్పించిన మొదటి, రెండో చార్జిషీట్లను, ఎమ్మార్ కేసులో సమర్పించిన అనుబంధ చార్జిషీట్ను తమకు ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.